కోట సచ్చిదానందశాస్త్రి


Contributors to Wikimedia projects

Article Images

కోట సచ్చిదానందశాస్త్రి

ప్రసిద్ధ హరికథా విద్వాంసుడు

కోట సచ్చిదానంద శాస్త్రి ప్రసిద్ధ హరికథా విద్వాంసుడు.[1] ఆదిభట్ల నారాయణ దాసు యొక్క ప్రశిష్యుడు. ఈయన హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. 1960లు చివరి భాగం,, 1980 లలో చాలా ప్రసిద్ధుడు. సచ్చిదానందశాస్త్రి గుంటూరు నివాసి. 1934 ఆగస్టు 12న అద్దంకిలో జన్మించాడు. ఎ.ఆర్. కృష్ణయ్య, ముసునూరి సూర్యనారాయణ మూర్తి, భాగవతుల అన్నపూర్ణయ్యల వద్ద హరికథను అభ్యసించాడు[2]

కోట సచ్చిదానందశాస్త్రి
కోట సచ్చిదానందశాస్త్రి
జననం 12 August 1934
అద్దంకి
మరణం 2924-09-16
గుంటూరు
వృత్తి హరికథలు

ఈయన హరికథలు, సినిమా చూస్తున్నట్లు ఉంటాయి అంటే అతిశయోక్తి లేదని చెప్పుకుంటారు. హరికథలో పాటలు, అప్పటి సినిమా హిట్ పాటలనుసరించి పాడేవారట. ఆంటే, ఆయన హరికథ చెప్తుంటే, అంత వినోదాత్మకంగా ఉంటుందన్నమాట. హరికథ చెప్తూ, ఆయన నృత్యం చేసేవారు, చక్కగా పాటలు పాడేవారు, హాస్యంగా జోక్స్ చెప్పేవారు. చెప్పే విషయం మీద అప్పటి తరం ప్రజలను ఆకట్టుకోవటానికి పూర్తి ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యేవారు. పండితులకే కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పి వారిని మంచి మార్గంలోకి మరలేటట్టు ప్రభావితం చేయడానికి చాలా కృషి చేశారు.

ఆంధ్రపదేశ్ లోను, ఇతర రాష్ట్రాలలోను 1500 పై చిలుకు ప్రదర్శనలు ఇచ్చి అనేకుల ప్రశంసలు, సన్మానాలు అందుకొన్నారు. ఇంకా మారిషస్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఆహ్వానాల మేరకు ఆయా దేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చారు.[2]

భారత ప్రభుత్వం 2023 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని కోట వారికి ప్రకటించిన సందర్బాన ,ప్రముఖ హరికధా విద్వాంసులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రిని గుంటూరులో వారి స్వగృహంలో కలసి మాజీ ఉపసభాపతి శ్రీమండలి బుద్ద ప్రసాద్అభినందించి సత్కరించారు. దివిసీమతో, శ్రీమండలి వెంకట కృష్ణారావు గారితో తనకు గల అనుబంధాన్ని శ్రీ శాస్త్రి గుర్తుచేసుకున్నారు. శ్రీ నారదులవారు తొలి హరికధకులని, తెలుగునాట శ్రీ మజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు హరికధా పితామహుడని,తనకు వచ్చిన పద్మశ్రీ యావత్తు హరికథాలోకానికి ఇచ్చినట్లు భావిస్తున్నానని,మానవుని మాధవునిగా, జీవుడిని దేవుడిగా చేయగల మహత్తర శక్తి హరికధకుందని శ్రీ సచ్చిదానంద శాస్త్రి చెప్పారు.

హరికధ తెలుగుభాషలో ప్రాచుర్యం పొందినంత మరే భాషలో పొందలేదని,తొలిసారిగా హరికధకు పద్మా పురస్కారం రావడం అనందదాయకమని శ్రీబుద్ద ప్రసాద్ అన్నారు. ఆధునిక కాలానుగుణంగా హరికధకు జనరంజకత్వాన్ని సాదించిన ఘనత శ్రీ సచ్చిదానంద శాస్త్రిదని,తన చిన్నప్పడు ఎడ్లబళ్లమీద తండోప తండాలుగా శ్రీ శాస్త్రి గారి హరికధ వినడానికి ప్రజలు వచ్చేవారని శ్రీబుద్ద ప్రసాద్ అన్నారు.ఆలస్యంగానైన 89 ఏళ్ల వయస్సు గల ప్రతిభా మూర్తిని గుర్తించడమే కాకుండా, సర్వకళల సమాహారమైన హరికధ కళకు తగు గుర్తింపునిచ్చినందుకు భారత ప్రభుత్వానికి శ్రీ బుద్దప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుని, హరికథ ప్రాచుర్యం ద్వారా ఇంకా ఏమి చేస్తే బాగుంటుందో అది చేయాలని శ్రీ శాస్త్రి గారు చెప్పారు. ఆయనకు భారత ప్రభుత్వం 2023లో పద్మశ్రీ అవార్డును ప్రకటించగా, ఆయన ఆ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2023 మార్చి 22న అందుకున్నాడు.[3][4] హరికథ లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి కోట.[2]

కోట సచ్చిదానందశాస్త్రి 2024, సెప్టెంబరు 16న గుంటూరులో మరణించాడు.[5]

  1. "Spellbound Kopparapu Kavula Kalapeetham 8th anniversary celebarated". baynews.in. Retrieved 18 October 2016.[permanent dead link]
  2. 2.0 2.1 2.2 2.3 ఎల్లాప్రగడ మల్లిఖార్జున రావు. హరికధకు పెట్టని 'కోట'. ఈనాడు.19 September 2024
  3. Andhra Jyothy (23 March 2023). "పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు". Archived from the original on 23 March 2023. Retrieved 23 March 2023.
  4. "ఆగిన హరికథా గంగా ప్రవాహం | Padmashri Kota Sachidananda Shastri passed away | Sakshi". www.sakshi.com. 2024-09-18. Archived from the original on 2024-09-18. Retrieved 2024-09-18.
  5. "దివికేగిన హరికథా చక్రవర్తి". EENADU. 2024-09-18. Archived from the original on 2024-09-18. Retrieved 2024-09-18.