లేపాక్షి


Contributors to Wikimedia projects

Article Images

లేపాక్షి

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా, లేపాక్షి మండల గ్రామం

లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న లేపాక్షి మండలం లోని గ్రామం, అదే మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2133 ఇళ్లతో, 10042 జనాభాతో 1891 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5373, ఆడవారి సంఖ్య 4669. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1120 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 134. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 595570[2].

లేపాక్షి

లేపాక్షి వీరభద్రాలయంలోని శివ పార్వతీ కళ్యాణ మంటపం

లేపాక్షి వీరభద్రాలయంలోని శివ పార్వతీ కళ్యాణ మంటపం

పటం

లేపాక్షి is located in ఆంధ్రప్రదేశ్

లేపాక్షి

లేపాక్షి

అక్షాంశ రేఖాంశాలు: 13°48′13.4640″N 77°36′34.4880″E / 13.803740000°N 77.609580000°E
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి
మండలంలేపాక్షి
విస్తీర్ణం18.91 కి.మీ2 (7.30 చ. మై)
జనాభా

 (2011)[1]

10,042
 • జనసాంద్రత530/కి.మీ2 (1,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు5,373
 • స్త్రీలు4,669
 • లింగ నిష్పత్తి869
 • నివాసాలు2,133
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్515331
2011 జనగణన కోడ్595570
ఏకశిలా నంది

లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాన శైవక్షేత్రం, పర్యాటక కేంద్రం. ఇక్కడ వున్న వీరభద్ర స్వామి దేవాలయం (లేపాక్షి) నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు.ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా "లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయా"నికి గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది.[3][4] ఈ ప్రక్రియలో భాగంగా యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేరింది.[5]

రామాయణములో రావణాసురుడు సీతను అపహరించుకుని వెళుతుండగా ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలములో పడిపోయినట్లు, ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి, జరిగిన విషయం తెలుసుకుని, తర్వాత ఆ పక్షికి మోక్షమిచ్చి లే-పక్షీ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను పదమే క్రమ క్రమముగా లేపాక్షి అయినట్లు స్థలపురాణంద్వారా తెలుస్తుంది.[6]

మరో కథనం ప్రకారం అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తై, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి విరూపణ్ణ వ్యతిరేకులు ఈ విషయం గురించి చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇచ్చట గుట్టవంటి ఏకశిలను బసవేశ్వరుడుగా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద బసవడు బహుకొద్దిచోట్లమాత్రమే ఉన్నాయి. ఈగుడిని ఉద్ధేసించి "లేపాక్షి రామాయణము" అను హరికథ ఉంది. పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపం ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు. నాలుగు కాళ్ళ మండపం విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో పశ్చిమ వైపు భాగంలో ఉంది.

ఈ ఊరు శ్రీ కృష్ణదేవ రాయలు కాలములో మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగా ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలం. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు. ఈ శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేది. ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ప్రశాంతముగా డేవుని కొలిచేవారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించాడు. ఈ లేపాక్షి దండకారణ్యం లోనిది. ఇచ్చట జటాయువు పడియుండెననీ, శ్రీరాముడు ఆతనిని "లే పక్షీ" అని సంబోధించారని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారం జరిగింది. శ్రీరాముడు ఉత్తరం నుండి దక్షిణానికు వచ్చాడని కొందరంటారు.

ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.

ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని సా. శ. 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనం వెచ్చించి రామదాసుకు చాలాముందే ఈ వీరభద్రాలయం కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా, రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలనీ కళ్ళు తీయించుకున్నాడట. ఆలయ నిర్మాణం మూడింట ఒక వంతు ఆగిపోవడం ఇందువల్లనే అంటారు. ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ముందు ఈ స్థలం కూర్మ శైలం అనే పేరుగల ఒక కొండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారాలుగల ఆలయం కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన నాలుగు ప్రాకారాలు కాలగర్భమున కలసిపోయాయివని అంటారు. ప్రాకారం గోడలు ఎత్తైనవి. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనాలు మలచారు. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయి. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభద్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడతాడు. వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు కలంకారి చిత్రాలతో తీర్చిదిద్దబడ్డది. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి శిల్పుల కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.[7]

 
లేపాక్షి వీరభద్ర దేవాలయంలో విరూపాక్ష అమ్మవారి ఉత్సవ మూర్తి
 
లేపాక్షి దేవాలయంలోని 16వ శతాబ్దపు వర్ణచిత్రం

లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలతో నిర్మించబడింది. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనం గొప్పదనం- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనం కూడా చూడవచ్చు. సమకాలికుడగు పింగళి సూరన్న ప్రభావతీ ప్రద్యుమ్నమున కొంత సూచించాడు. అందు ప్రభావతీ వర్ణన " కన్నుల గట్టినట్లు తెలికన్నుల నిక్కను జూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడన్ శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు" అని శుచిముఖిచేత వర్ణించాడు.శివ, వీరభద్ర, వైష్ణవాలాయములకు సమానమైన ముఖమండపం పైకప్పు లోభాగాన మహాభారత, రామాయణ పౌరాణిక గాథల లిఖించారు. వీరభద్ర దేవాలయపు గోడలమీదను, శివాలయపు అర్ధపంటపమున శివకథలతో అలంకరించారు. పార్వతీ పరిణయం, పార్వతీ పరమేశ్వరుల పరస్పరానురాగ క్రీడలు, త్రిపుర సంహారం, శివ తాండవం లోని ఆఖ్యాయికలు గాథా విషయాలుగ చేర్చబడినవి.

ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది.

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల సేవామందిర్ లో ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాలలో విద్యా ప్రమాణాల అభివృద్ధికి, బీదరికం అడ్డుకాకుండా వుండటానికి ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను ఉచితంగా అందచేయడానకి ప్రారంభించిన జవహర్ నవోదయ విద్యాలయం పథకం క్రింద 1987లో ఈ విద్యాలయాన్ని ప్రారంభించారు. విశాలమైన క్రీడామైదానం, గ్రంథాలయంతో పాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయం లోను విద్యార్థులకు పాఠాలు బోధించేలా పనిచేసే ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్ శిక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంగీతం, చిత్రలేఖనం లోనూ తర్ఫీదు ఇస్తారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నేషనల్ కౌన్సిల్ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సిలబస్‌లో బోధన జరుగుతుంది. 10, 12 తరగతుల విద్యార్థులు సెంటర్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షలకు హాజరవుతారు.

లేపాక్షిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

లేపాక్షిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

లేపాక్షిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 378 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 321 హెక్టార్లు
  • బంజరు భూమి: 781 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 395 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1077 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 421 హెక్టార్లు

లేపాక్షిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 417 హెక్టార్లు
  • చెరువులు: 4 హెక్టార్లు

లేపాక్షిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

వేరుశనగ, మొక్కజొన్న, వరి

  • వీరభద్ర మందిరం

  • వీరభద్ర మందిరం లోపల

  • నాగలింగం

  • బసవన్న

  • శివ పార్వతీ కళ్యాణ మంటపం

వికీమీడియా కామన్స్‌లో Lepakshiకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "The Lepakshi heritage". Business Line.
  4. Voice, Amaravati. "Lepakshi May Get World Heritage Status". amaravativoice.com. Archived from the original on 4 December 2017. Retrieved 4 December 2017.
  5. "యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు". ETV Bharat News. Retrieved 2022-03-29.
  6. Chandaraju, Aruna (2012-01-27). "The hanging pillar and other wonders of Lepakshi". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-10-31.
  7. పొణుగుపాటి కృష్ణమూర్తి (1933). మన పవిత్ర వారసత్వము. p. 222.