ధర్మాన ప్రసాదరావు


Contributors to Wikimedia projects

Article Images

ధర్మాన ప్రసాదరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను శ్రీకాకుళం శాసనసభ నియోజక వర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ రాష్ట్ర మంత్రి. అతను ఆంధ్ర ప్రదేశ్ విభజన జరగక పూర్వం గల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రోడ్లు, భవనాల శాఖ, రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు.[1] ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా రెవెన్యూ, స్టాంప్ లు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా నియమితులయ్యారు

ధర్మాన ప్రసాదరావు
ధర్మాన ప్రసాదరావు

ధర్మాన ప్రసాదరావు


రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రి

పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
2009 – 2014
ముందు గుండ అప్పలసూర్యనారాయణ
తరువాత గుండ లక్ష్మీదేవి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
1989 – 1994
ముందు శిమ్మ ప్రభాకరరావు
తరువాత బగ్గు లక్ష్మణరావు
పదవీ కాలం
1999 – 2004
ముందు బగ్గు లక్ష్మణరావు
తరువాత ధర్మాన కృష్ణదాస్

వ్యక్తిగత వివరాలు


జననం 1957 మే 21 (వయసు 67)
శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట, మబగాం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రామలింగంనాయుడు (తండ్రి)
సావిత్రమ్మ (తల్లి)
జీవిత భాగస్వామి గజలక్ష్మీ
బంధువులు ధర్మాన కృష్ణదాస్ (సోదరుడు)
సంతానం రామమనోహర్ నాయుడు
నివాసం శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట, మబగాం
వృత్తి వ్యవసాయం, వ్యాపారం
మతం హిందూ

అతను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన మబగాం గ్రామంలో సావిత్రమ్మ, రామలింగంనాయుడు దంపతులకు 1957 మే 21 న జన్మించాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా 1989, 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అతను నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో చేనేత,జౌళిశాఖ, క్రీడలు, చిన్నతరహా నీటిపారుదలం మైనరు ఫోర్టుల శాఖలకు మంత్రిగా తన సేవలనందించాడు. అతను వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసాడు.

అతను 1981లో మబగాం గ్రామ సర్పంచ్‌గా, 1982లో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1987లో పోలాకి మండల తొలి అద్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసాడు. 1994లో ఎ.ఐ.సి.సి సభ్యునిగా, 2001లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందించాడు.

అతను ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు వాన్ పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించబడ్డాడు. వాన్ పిక్ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరును కూడా సిబిఐ పేర్కొంది. దీంతో ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[2][3][4] తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించాడు. సమైక్యాంధ్రకు మద్ధతుగా రాజీనామా చేసినట్లు ధర్మాన తెలిపాడు.[5]

2013లో అతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోకి చేరాడు. అతను వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందిస్తున్నాడు.[6] ఆయన వైఎస్సార్‌సీపీ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీగా, పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జిగా, అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేసి 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి 2022 ఏప్రిల్ 11న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7][8][9]